—
రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్యా 11/ యాదాద్రి భువనగిరి జిల్లా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో గత, ప్రస్తుత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని వాటి పరిష్కారం కోసం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ తెలిపారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కీలక ప్రాజెక్టులుగా ఉన్న బస్వాపురం ప్రాజెక్టు, గంధమల్ల ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, నవాబ్ పేట రిజర్వాయర్ ప్రాజెక్టు, చిన్న నీటి పారుదల కాలువలైన ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని, ఆసిఫ్ నహర్ కాలువ పునరుద్దరణ పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30, 31తేదీలలో సీపీఎం చలో హైదరాబాద్ పేరిట రైతులు, నిర్వాసితులు,ప్రజలతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమై 31న హైదరాబాద్ ఇందిరా ధర్నా చౌక్ కు చేరుకుంటుందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే ” మహా ధర్నా ” లో రైతులు, వ్యవసాయ కార్మికులు, నిర్వాసితులు, వృత్తి దారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 90 శాతం పూర్తయిన బస్వాపురం ప్రాజెక్టుకు మిగతా నిధులు ఇవ్వడంలో జాప్యంపై వివరణ ఇవ్వాలన్నారు. సుమారు 420 కోట్లకు పైచిలుకు డబ్బులు నిర్వాసితులకు చెల్లించవలసి ఉందన్నారు. 80 కోట్లు మంజూరు చేసినట్లు చెబుతున్న ఫైనాన్స్ కమిటీ వద్ద సంవత్సరం నుండి నిధులు నిలిచిపోయాయి. అన్నారు. అరకోర, అత్తెసరు నిధులు కేటాయిస్తూ దశాబ్దాల తరబడి ప్రాజెక్టు పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. భూ నిర్వాసితుల రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలన్నారు. పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు ఎదుల రిజర్వాయర్ ద్వారా డిండి ప్రాజెక్టుకు నీళ్లు తేవాలన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా రాచకొండ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రిజర్వాయర్ ద్వారా నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నవాబుపేటకు నీళ్లు ఇస్తామని సుమారు 15 సంవత్సరాల కింద కాల్వలు తోవ్వారని కానీ అందులో నీళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ వెడల్పు పనులు నిలిచిపోయాయి అన్నారు. పిలాయిపల్లి, బునాదిగాని కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కాలువల కింద 30 కల్వర్టులు కట్టవలసి ఉందన్నారు. జిల్లాలో మూసి ప్రక్షాళన, గోదావరి జలాలు అనుసంధానంకై ప్రభుత్వం దగ్గర డిపిఆర్ లేదని విమర్శించారు. బస్వాపురం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడానికి పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని, శామీర్పేట కాల్వ ద్వారా బొమ్మలరామారం, బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి మండలాలకు సాగునీరు అందించాలన్నారు. *ఈ నెల 16న సాగు తాగునీటి సమస్య పరిష్కారం కోసం వివిధ రాజకీయ పక్షాలతో, ప్రజాసంఘాలతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం* భువనగిరిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. *ఆగస్టు 31న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు* పెద్ద ఎత్తున అన్ని వర్గాలు తరలిరావాలని యండి జహంగీర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు.
