రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 15/- యాదాద్రి జిల్లా ప్రతినిధి షిర్డీ సాయిబాబా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, విమర్శకులపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ట్రస్ట్ సహయకార్యదర్శి వంకాయల బలరాం తెలిపారు. బుధవారం ఆయన రాయల్ పోస్ట్ న్యూస్ ప్రత్యక ప్రతినిధితో మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ప్రతి పౌరుడికి తన మత విశ్వాసాలను స్వేచ్ఛగా అనుసరించే, ఆచరించే, ప్రచారం చేసుకునే హక్కు కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టికల్-25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన నమ్మకానికి అనుగుణంగా ఏ మతాన్నైనా స్వీకరించి ఆచరించే హక్కు ఉందని వివరించారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలోని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి రమడేశ్వరం క్షేత్రానికి సంబంధించిన అంశాలపై మాట్లాడుతూ, షిర్డీ సాయిబాబా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిపై కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిపై సాయి భక్తులు తెలంగాణ హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 20273/2026 ద్వారా పరువునష్టం దావా దాఖలు చేశారని చెప్పారు. కాకునూరు లలిత్ కుమార్, వేద బ్రహ్మ లలిత్, కృష్ణశాస్త్రి, దువ్వాడ శివప్రసాద్ చౌదరి, అపరాధిత కౌడీన్య, శ్రీకాంత్ శర్మ, కేల్లి, భాస్కరరావు, సంతోష్ కుమార్ పై కేసు దాఖలైనట్లు తెలిపారు. ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి 2026 జూన్ 13న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే షిర్డీ సాయిబాబా పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిపై యూట్యూబ్ వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మహర్షి రచించిన ‘శత ప్రశ్న శరసంధానం’ గ్రంథంలో నూరు ప్రశ్నలకు నూరు సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు.
జ్ఞానపరంగా ఎదుర్కోలేక కొందరు కుయుక్తులతో ఆరోపణలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో గతంలో భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో యూట్యూబ్ ద్వారా జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలని స్పష్టంగా ఆదేశించిందని చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠం, సిద్ధగురు రమణి రమేశ్ సురక్షత్రం సభ్యులు పేర్కొన్నట్లు తెలిపారు. షిర్డీ సాయిబాబా, రమడేశ్వరం క్షేత్రంపై జరుగుతున్న ప్రచారాన్ని నిరసిస్తూ ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు విశ్వవిద్యాలయం ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే షిర్డీ సాయిబాబాపై, సిద్ధగురు రమేశ్వరం స్వామిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని శివసాయి సేన రాష్ట్ర అధ్యక్షులు మామిడాల రవికుమార్ హెచ్చరించినట్లు చెప్పారు. ఇటీవల విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధగురు రమేశ్ క్షేత్రాన్ని సందర్శించి గురువుగారి ఆశీస్సులు పొందారని తెలిపారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రముఖులు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షికి మద్దతు ప్రకటిస్తూ శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠాన్ని సందర్శించనున్నట్లు వంకాయల బలరాం తెలిపారు.

