రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 06 : ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓబీసీల సమస్యలపై చర్చించి పరిష్కరించే విధంగా చూడాలని ఓబీసీ అఖిల పక్ష జాతీయ సదస్సులో నేతలు డిమాండ్ చేశారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అధ్యక్షతన గురువారం కాచిగూడలో ఓబీసీల అఖిల పక్ష జాతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓబీసీల హక్కులు, రాజ్యాంగ బద్ద రిజర్వేషన్లు, సామాజిక న్యాయం వంటి అంశాలపై సమగ్ర చర్చ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత 50 సంవత్సరాలుగా బీసీలు న్యాయమైన డిమాండ్ల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని విమర్శించారు. జనగణనలో ప్రత్యేక ఓబీసీ వివరాలకు స్థానం కల్పించాలని కోరారు. ‘రిజర్వేషన్ల హటావో’ పేరిగ జరుగుతున్న కుట్రలను సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓబీసీ నేతలు రాజేష్ యాదవ్, బాలకృష్ణ, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.
