మధురఫలం మామిడి.. ఉత్తరాంధ్ర లో తగ్గుతున్న దిగుబడి….

Fasiuddin Mohammed
5 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ ఉత్తరాంద్ర మే 28/ ఫలాల్లో రారాజు మామిడి. పోషక విలువలు గల ఈ ఫలం వేసవిలో ఓ వరం. ప్రకృతి ప్రసాదించిన ఈ అమృతాన్ని మితంగా ఆస్వాదిస్తే ఆరోగ్యపరంగా లాభాలెన్నో.. అయితే ఆ మామిడిని సాగు చేస్తున్న రైతులను మాత్రం కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి ఎద్దడి, మంచు, గాలివానల వల్ల ప్రతీ సంవత్సరం  దిగుబడి పడిపోతోంది. కాయ దిగుబడి తగ్గితే గిట్టుబాటు ధరలు పెరగాలి. కానీ… వ్యాపారులు ధరలను నియంత్రిస్తుండటంతో… నష్టాల భారం రైతులకు, అధిక ధరలు ప్రభావం , కొనుగోలుదారులపై పడుతోంది. ఉత్తరాంధ్రలోనూ రాను రాను మామిడి దిగుబడి తగ్గుతోంది. ఒకప్పుడు ఉత్తరాంధ్రలో మామిడి వ్యాపారం జోరుగా సాగేది. ఈ ప్రాంతంలో పండే మామిడి రకాలకు మంచి గిరాకీ ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, సంరక్షణ చర్యలు సరిగ్గా పాటించకపోవడం, అరుదైన రకాలు కాపాడేందుకు శాస్త్రీయ ప్రయత్నాలు జరగకపోవడం, భూములు విలువ పెరగడంతో మామిడి పంట పండించే స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడంతో ఉత్తరాంధ్రలో మామిడి తోటలు తగ్గుతున్నాయి. రసాయనాల వినియోగంతో నాణ్యతకు గండి మరోపక్క మాధుర్యాన్ని పంచి.. ఆరోగ్యాన్నిచ్చే మామిడి పండ్లు విషతుల్యమవుతున్నాయి. పక్వానికి వచ్చిన మామిడి కాయలను గడ్డిలో మగ్గ బెట్టాల్సిన వ్యాపారులు త్వరితగతిన సొమ్ము చేసుకోవడానికి రసాయనాలు వాడి కృత్రిమంగా మగ్గిస్తున్నారు. ఇలా మధురమైన మామిడి పండ్లను విషపూరితం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించలేని  జనం రోగాలను ‘కొని’ తెచ్చుకుంటున్నారు.
విశాఖలో మే 28 నుంచి 3వ మామిడి మేళా
ఆరోగ్యమే మహాభాగ్యం- అందరూ ఆరోగ్యంగా జీవించాలనే తలంపుతో  గో ఆధారిత  ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, విశాఖపట్నం వారు మామిడి రైతులు  సహజ సిద్ధంగా పండించి  ముగ్గించిన వివిధ రకాల జాతుల మామిడి పళ్ళును విశాఖ ప్రజలకు అందించాలని తద్వారా ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో  3వ మామిడి మేళా మామిడి రైతులుతో  మే నెల 28,29,30,31  తేదీలలో ఉదయం నుండి రాత్రి 8
గంటల వరకూ  విశాఖపట్నం లో , బీచ్ రోడ్, కామత్ హోటల్ ప్రక్కన, లాసన్స్ బే కాలనీ  నందు  మామిడి పళ్ళు, మామిడి ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకం నిర్వహించనున్నారు.ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్గానిక్ మామిడి రైతులకు చేయూతనివ్వాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.
సీజన్లో ఉత్తమమైన, రుచికరమైన మామిడిపండ్లను ఆస్వాదించడం శ్రేయస్కరమని చెబుతున్నారు. కనుమరుగవుతున్న అరుదైన మామిడి రకాలు ఉత్తరాంధ్రలో ప్రభుత్వ చేయూత ఇవ్వకపోవడం,సమన్వయ లోపంతో అరుదైన మామిడి పండ్ల రకాలలు కనుమరుగవుతున్నాయి. ఫిరంగి లడ్డువా, గుర్రం మామిడి, శ్వేతామృతం, మెట్టవలస పీచు, ఖల్లాల మామిడి, కొవ్వాడ మామిడి, నూర్జహాన్ మామిడి, రసామృతం లాంటి అనేక రకాలు ఎక్కడో అరుదుగా ఒకటి రెండు మామిడి మొక్కలు మిగిలి ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అందుబాటులో ఉన్న మామిడి రకాలు ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన మామిడి రకాలు అందుబాటులో ఉన్నాయి.గత ఏడాది అంచనాల ప్రకారం సువర్ణ రేఖ, బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు, తోతాపూరి, దసేరి, హిమాంప సందు, సుందరి అటు ఇటుగా కొంత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం గ్రామాలకు విస్తరించడంతో మామిడి తోటలు తగ్గిపోతున్నాయి. మామిడి దిగుబడిలో రెండో స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ మామిడి పళ్ళు ఆరోగ్యానికి అమృతం.. కానీ అవి తినే పద్ధతి తెలిస్తేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెప్తున్నారు. దానిలో దాదాపు 200 పైగా వివిధ రకాలు ఉన్నాయి. ఎంత అనారోగ్యం ఉన్నా మామిడి పండ్లు మితంగా తింటే ఆరోగ్య లాభాలు ఎన్నో. ఓ విధంగా పోషకాల నిధి మామిడిపండు అని చెప్తారు. ప్రపంచానికి ఎగుమతుల్లో దేశంలో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దేశంలో మామిడి దిగుబడి 2024-25 మొత్తం ఉత్పత్తి 228.37 లక్షల టన్నులు. గత ఏడాదితో పోలిస్తే 4.39 లక్షల టన్నుల ఎక్కువ దిగుబడి నమోదు చేసుకుంది. ప్రపంచ మామిడి ఉత్పత్తుల్లో మన దేశం నుంచి 40శాతం వాటా ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ 45 లక్షల టన్నులు, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 38 లక్షల టన్నులు దిగుబడి సాధించగా మూడో స్థానంలో కర్ణాటక 20 లక్షల టన్నులు. తర్వాతి స్థానంలో బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ను “మ్యాంగో బౌల్ ఆఫ్ ఇండియా” అంటారు. ఆంధ్రప్రదేశ్ లో బంగినపల్లి మామిడి పండు రకానికి జియో టాగ్ ఉంది. భారత దేశం నుంచి ఎక్కువగా యూఏఈ, సౌదీ అరేబియా, యూకే, ఖతార్, బంగ్లాదేశ్,అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.మామిడి రకం ఆల్ఫన్సో మహారాష్ట్ర నుంచి, దసేరి ఉత్తరప్రదేశ్ నుంచి, బంగినపల్లి, రసాలు ఆంధ్రప్రదేశ్ నుంచి, కేసరి గుజరాత్ నుంచి. ముఖ్యం గా తోతాపూరి అనే మామిడి రకం ఆంధ్ర,కర్ణాటక నుంచి ప్రాసెసింగ్ చేసి మ్యాంగో పల్ప్ ఎక్కువ ఎగుమతి చేస్తారు. రసాయనాలతో పండించే మామిడి రకాల కన్నా ఆర్గానిక్ మామిడికి మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం సబ్సిడీలు, ఎగుముతుల ప్రమోషన్ లాంటి కార్యక్రమాలు అవసరానికి, అవకాశానికి తగినంత లేదు. మనదేశంలో మామిడి ని సంరక్షించుకోవడంలో వెనుకబడిపోతున్న తరుణంలో విదేశీ మోజుతో ఏమాత్రం నాణ్యతలేని, అరోమా లేని మామిడి రకాలు ఇప్పటికే ప్రధాన నగరాల్లో దిగుమతి చేసుకోవడం దురదృష్టకరం.థాయిలాండ్, బంగ్లాదేశ్,మలేషియా తదితర దేశాల నుండి బ్లాక్ మ్యాజిక్, టామీ ఆక్సి, మెజిస్టిక్, మిటోజా, కేనెంట్, మియాబార్కు లాంటి మామిడి రకాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. నాణ్యమైన, పోషక విలువలు కలిగిన స్వదేశీ మామిడి రకాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉన్న నేపథ్యంలో వీటి పంట విస్తరణకు, గిట్టుబాటు ధర కల్పనకు, మార్కెట్ సదుపాయాల కల్పనకు పాలకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నాణ్యతలేని విదేశీ మామిడి రకాలను అధిక ధరలకు కొంటున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కలిగించాలి. అప్పుడే పోషక విలువలు గల మామిడి ఫలాలు అందరికీ అందుతాయి… డా ” యం. అర్. యన్. వర్మ. సీనియర్ జర్నలిస్ట్, విశాఖపట్నం

📄 Generate e-Paper Clip
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *