గజ్వేల్, 04 ఆగస్టు 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జాలిగామ గ్రామానికి వెళ్లే బైపాస్ రోడ్డు తీవ్ర అధ్వానంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపై గుంతల కారణంగా తరచూ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలోనే పత్రికల ద్వారా రోడ్డు దుస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి స్పందనా తీసుకోకపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి, తక్షణమే ఈ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాల బారిన పడకుండా చూడాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలు, జాలిగామ గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.
