భక్తుల ఇలవేల్పు.. నింబోలిఅడ్డ మహంకాళి….ఆలయ ధర్మకర్త రాజేందర్ పటేల్ గౌడ్

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 02: కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా నింబోలిఅడ్డ మహంకాళి అమ్మవారు నిత్య పూజలందుకుంటున్నారు. 245 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంలో ఆగస్టు 8, 9, 10 తేదీలలో జరగనున్న బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. నింబోలిఅడ్డలో నివసించే పటేల్ జంగులు గౌడ్ అనే వ్యక్తికి ఒక రోజు అమ్మవారు కలలో కనపడి ఆలయం నిర్మించమని ఆదేశించగా మహాంకాళి ఆలయం, దర్బారు మైసమ్మ ఆలయాలను నిర్మించారు. ఆలాగే మరో ఐదు మందిరాలను కూడా వారు నిర్మించారు. అవి మోతీ మార్కెట్లో అరె మైసమ్మ ఆలయం, ఇసామియాబజార్ లోని పోచమ్మ ఆలయం, నల్లపోచమ్మ ఆలయం, దర్బార్ మైసమ్మ ఆలయాలు ఉన్నాయి. ఈ నెల 8వ తేదీన శనివారం సాయంత్రం అమ్మవారి ఘటం ఎదుర్కోళ్ళతో బోనాల ఉత్సవాలు పారరంభమవుతాయని ఆలయ ధర్మకర్త రాజేందర్ పటేల్ గౌడ్ తెలిపారు. 9వ తేదీన ఆదివారం ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆగష్టు 10వ తేదీన సోమవారం మధ్యాహ్నాం 2 గంటలకు పచ్చికుండ కార్యక్రమం, పోతరాజు, గావుపట్టుల, బలిగంప, రంగం ఎక్కి భవిష్యత్తు వాణిని అమ్మవారు చెబుతారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారిని ఊరేగిస్తూ సాగనంపడంతో బోనాల ఉత్సవాల కార్యక్రమం ముగుస్తుందని ఆయన తెలిపారు. 9వ తేదీన ఆదివారం జరిగే బోనాల వేడుకల్లో కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ ప్రాంత ప్రజలతో పాటు కాచిగూడ, బర్కత్పుర, నారాయణగూడ, ఇసామియాబజార్, గోల్నాక, అంబర్పేట, నల్లకుంట, చెప్పల్బజార్, చాదర్ ఘాట్ తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

📄 Generate e-Paper Clip
Share This Article