
భువనగిరి ఈద్గా భూమి కేసులో వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు సంచలన తీర్పు: అడ్వకేట్ రహీమ్కు ఘన సన్మానం
రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి మే 22/
భువనగిరి టౌన్లోని చెరువు కట్ట భూమి వివాదంలో తెలంగాణ హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించి, వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చేలా కృషి చేసిన ప్రముఖ న్యాయవాది (అడ్వకేట్) రహీమ్ను ముస్లిం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఖ్వాజా బషీరుద్దీన్ మాట్లాడుతూ.. భువనగిరి ఈద్గాకు అనుకూలంగా హైకోర్టు నుండి ఇంతటి పెద్ద తీర్పు రావడం ఎంతో సంతోషకరమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భువనగిరి టౌన్ (చెరువు కట్ట) సమీపంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ భూమిని పట్టా భూమిగా చిత్రీకరిస్తూ, రెవెన్యూ శాఖకు మరియు హైకోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి, గత ఈద్-ఉల్-ఫితర్ (రమజాన్) ప్రార్థనల నిర్వహణకు సైతం ఆటంకాలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదుల మధ్య జరిగిన సుదీర్ఘ వాదనల్లో భువనగిరి కి చెందిన ప్రముఖ అడ్వకేట్ రహీమ్ తన అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. కోర్టు ముందు బలమైన డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పిస్తూ, సదరు భూమి పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందినదేనని నిరూపించారు. గతంలో లోయర్ కోర్టు మరియు రెవెన్యూ కలెక్టర్ సైతం ఈ భూమి వక్ఫ్ బోర్డుదేనని ధృవీకరించిన విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు వారన్నారు . అడ్వకేట్ రహీమ్ వినిపించిన బలమైన వాదనలను, కేసులోని అన్ని కోణాలను పరిశీలించిన గౌరవ హైకోర్టు.. ఆక్రమణదారులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ (Dismiss) తీర్పునిచ్చింది.
గెలుపు ఎప్పుడూ సత్యానిదే అని వారు సందర్భంగా అన్నారు .
ఈ చారిత్రాత్మక విజయంపై అడ్వకేట్ రహీమ్ మాట్లాడుతూ.. దైవానుగ్రహం, ప్రజలందరి ఉమ్మడి కృషి వల్లే నేడు కొత్త ఈద్గాలో మళ్లీ ప్రార్థనలు చేసుకునే అవకాశం లభించిందన్నారు. గెలుపు ఎప్పుడూ సత్యానిదేనని, నేటి తీర్పు ఆ విషయాన్ని మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. ఒకసారి వక్ఫ్ చేసిన భూమి ఎప్పటికీ వక్ఫ్ భూమిగానే ఉంటుందని, దానిని కొనడం లేదా అమ్మడం చట్టప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో తనకు మొదటి నుండి పూర్తి మద్దతుగా నిలిచిన భువనగిరి ముస్లిం యువతకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో ముస్లిం నాయకులు ఇక్బాల్ చౌదరి, అజీముద్దీన్, మోయిన్, ముజీబ్, అమీన్, కాజిమ్ మరియు తదితరులు పాల్గొన్నారు .