రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 10/

అరుణోదయ యాదాద్రి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న విప్లవ సాంస్కృతిక యోధుడు నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని అరుణోదయ జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి, జిల్లా కార్యదర్శి ఎలగందుల సిద్ధులు పిలుపునిచ్చారు.
ప్రజా సాంస్కృతికోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన నాగన్న సేవలను స్మరించుకునేందుకు ఈ సంతాప సభను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రజా కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, యువజనులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాగన్న తన పాటల ద్వారా ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకువచ్చారని, అణగారిన వర్గాల పక్షాన నిలబడి ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో విశేష పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని అన్నారు. నేటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, నాగన్న చూపిన పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సంతాప సభలో ఆయన జీవితం, ఉద్యమ ప్రస్థానం, ప్రజా సాంస్కృతిక రంగానికి చేసిన సేవలపై పలువురు వక్తలు మాట్లాడనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాకాల నరేష్, పాకాల సరిత, మామిడాల ప్రవీణ్, కల్లెపు ప్రణయ్, ఇక్కిరి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.