గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య .

Fasiuddin Mohammed
2 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 5/ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విస్తృతంగా పర్యటించారు.

గ్రామంలో ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండవ విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలేరు నియోజకవర్గానికి రెండవ విడతలో అత్యధికంగా ఇళ్ల మంజూరుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామాభివృద్ధి కోసం అవసరమైన రహదారులు, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు.
తదుపరి గ్రామ చేనేత సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

గౌరాయిపల్లి గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని, గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలేరు నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఆలేరు నియోజకవర్గానికి ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రతి అర్హ కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article