

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 30/ యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్–2026 నిర్వహణపై పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన, నిరాశ్రయులైన మరియు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు, హోటళ్లు, దుకాణాలు, నిర్మాణ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసు శాఖ, కార్మిక శాఖ, బాలల సంక్షేమ శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలని ఎస్పీ గారు ఆదేశించారు. చిన్నారుల హక్కులను పరిరక్షిస్తూ, వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సున్నితంగా వ్యవహరించాలని సూచించారు.
ఆపరేషన్ ముస్కాన్–2026 కార్యక్రమం 2026 జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీ లక్ష్మీనారాయణ, డీసీఆర్బీ సీఐ శ్రీ హనుమంత్ నాయక్, కార్మిక శాఖ అధికారులు, అలాగే ఆపరేషన్ ముస్కాన్ బృందం సభ్యులు పాల్గొన్నారు.