
యాదాద్రి భువనగిరి రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి ఆగస్ట్ 7/ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాక్షస పరిపాలన సాగిస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోందని రాకేష్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రూ.4,000 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు. హామీలను గాలికి వదిలేసి ప్రజలను వంచించిన ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన జిల్లా, మండల స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.