రోడ్డెక్కిన మురుగు.. దుర్గంధంతో ప్రయాణికుల నరకయాతన!భువనగిరి ప్రధాన రహదారిపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ…

1 Min Read

రెస్టారెంట్, వ్యాపార వ్యర్థాల వ్యాపారాలతో మోరీల దిగ్బంధం…

పట్టనట్టు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు….

భువనగిరి, ఆగస్టు 1 (రాయల్ పోస్ట్ న్యూస్ ):
భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు పొంగిపొర్లుతుండటంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా మారింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.

పట్టణంలోని అవినాష్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యం తమ హోటల్ నుంచి వచ్చే పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాలను నేరుగా మున్సిపల్ డ్రైనేజీ (మోరీ)లోకి వదులుతున్నారు. దీనికితోడు అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్న ఇడ్లీ బండి వ్యర్థాలు కూడా డ్రైనేజీలోనే పడేస్తుండటంతో మోరీలు పూర్తిగా పూడిపోయి, మురుగునీరు సజావుగా సాగక రోడ్డుపైకి ప్రవహిస్తోంది.

*మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం*…
రోజురోజుకూ మురుగునీరు రోడ్డుపై చేరుతూ దుర్గంధం వెదజల్లుతున్నా, సంబంధిత మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మురుగు కాలువల్లో వ్యర్థాలు వేస్తున్న రెస్టారెంట్ యాజమాన్యంపై గానీ, ఇడ్లీ బండి నిర్వహకులపై గానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*రోగాలు వచ్చే ప్రమాదం*
ప్రధాన రహదారిపై నిరంతరం మురుగునీరు నిలిచి ఉండటం వల్ల ఈగలు, దోమలు ముసిరి అంటురోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానిక నివాసితులు, వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టాలని, డ్రైనేజీని చెత్తమయం చేస్తున్న రెస్టారెంట్, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article