కుకునూర్ పల్లిలో ఘనంగా బొడ్రాయి మండల పూజ కార్యక్రమం ….

2 Min Read

గజ్వేల్ నియోజకవర్గం, 28 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలో బొడ్రాయి మండల పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, రాగి పాత్రలలో పవిత్ర జలాలను తెచ్చి బొడ్రాయికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య ముదిరాజ్ మాట్లాడుతూ… గ్రామ దేవత అయిన బొడ్రాయి ప్రతిష్టాపన మరియు మండల పూజలు నిర్వహించడం మన గ్రామ ప్రజల సుఖసంతోషాలకు సంకేతమని అన్నారు. “బొడ్రాయి పూజ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన గ్రామానికి రక్షణ కవచం. గ్రామ సరిహద్దులను కాపాడుతూ, ఎలాంటి దుష్టశక్తులు, అరిష్టాలు, అంటువ్యాధులు ఊరిలోకి ప్రవేశించకుండా బొడ్రాయి అమ్మవారు కాపాడుతుందని మన నమ్మకం. గ్రామస్తులందరూ ఐకమత్యంతో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని రాగి పాత్రల నీటితో అభిషేకం చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ పూజల వల్ల గ్రామంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు మరియు ప్రతి ఒక్కరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పురోహితులు పవన్ శర్మ, శివ శర్మ, రామ దత్తు శర్మ, గ్రామ ఉప సర్పంచ్ దొంతి సత్తయ్య, మాజీ సర్పంచ్ నవీన నరేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ అమరేందర్, మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య, వాసవి క్లబ్ సభ్యులు పాండురంగం, గ్రామస్తులు నాగులపల్లి నర్సింలు, ఇండ్ల రాములు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కుకునూర్ పల్లి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *