రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిది భువనగిరి ఆగస్ట్ 19/ భువనగిరి పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని, వెంటనే తగిన చర్యలు చేపట్టాలని స్థానిక మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. బుధవారం రోజున 22, 34వ వార్డుల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు కలిసి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలసి ఈ సమస్యపై విన్నవించారు.
ఈ సందర్భంగా 22వ వార్డు కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల సంచారం తీవ్రమవ్వడంతో చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే, గతంలో కుక్కలను పట్టుకునేందుకు నియమించిన కాంట్రాక్టర్ ABC (నిర్మూలన/వ్యాక్సినేషన్) నిబంధనల ప్రకారం సరిగ్గా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్పై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జాలిగం విఘ్నేష్, సరగడ రాజ్యలక్ష్మి అమర్, కో-ఆప్షన్ సభ్యులు సుజయత్ అలీ, కౌసర్ తదితరులు పాల్గొన్నారు.