రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 11/ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కాకతీయ పాఠశాల యాజమాన్యం పై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భువనగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కాకతీయ పాఠశాల యాజమాన్యం పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయని, ప్రస్తుతం మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని చితకబాదడం వారి అజ్ఞానానికి నిదర్శనమని ఆయన అన్నారు. కాకతీయ పాఠశాల యాజమాన్యం మహిళా ఉపాధ్యాయులను వేధించడం, ప్రైవేటు టీచర్లను శ్రమ దోపిడి చేయడం పరిపాటిగా మారిందని ఆయన అన్నారు. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రతో చితకబాదిన టీచర్ తో క్షమాపణ చెప్పించడం, తల్లిదండ్రులను ప్రలోభ పెట్టడం, సమస్యను కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయడం సరికాదని ఆయన అన్నారు. భువనగిరి మండల విద్యాధికారి రంగరాజన్, జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతిలు కాకతీయ పాఠశాల పై సమగ్ర విచారణ జరిపించి, విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాల పై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.