యాదాద్రి భువనగిరి రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 7/
సురక్షిత యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మాణంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, మరమ్మత్తులు మరియు వాటి ప్రాముఖ్యతపై పోలీస్ శాఖ విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలు, కాలనీలు, వ్యాపార, విద్యా సంస్థల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రధాన ప్రాంతాలను సందర్శించి సీసీటీవీ కెమెరాల పనితీరును పరిశీలించారు. పనిచేయని కెమెరాలకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని యజమానులకు సూచించడంతో పాటు, అవసరమైన ప్రదేశాల్లో కొత్త కెమెరాలను అమర్చుకోవాలని అవగాహన కల్పించారు.
సీసీటీవీల ప్రాముఖ్యతపై ఎస్పీ పిలుపు:
నేరాల నివారణకు, అనుమానాస్పద కదలికలను పసిగట్టడానికి సీసీటీవీ కెమెరాలు ఎంతో సహాయపడతాయని జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ తెలిపారు. "ప్రతి కెమెరా ఒక భద్రతా కవచం" అని పేర్కొంటూ, దర్యాప్తులో ఇవి కీలక ఆధారాలుగా మారుతాయని చెప్పారు. ప్రతి ఇల్లు, దుకాణం, అపార్ట్మెంట్ మరియు గ్రామీణ కూడళ్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవాలని సూచించారు. గ్రామ ప్రజాప్రతినిధులు, వ్యాపారులు మరియు ప్రజలందరూ పోలీస్ శాఖతో కలిసి సీసీటీవీ నెట్వర్క్ను విస్తరించడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.