భువనగిరి, రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 3/
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో భువనగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక కృషితో నిర్మించిన 444 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ప్రభుత్వ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ (ఎమ్మార్వో) ల సమక్షంలో ఎంతో పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా 444 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారని గుర్తుచేశారు. ఆ తర్వాత కూడా అధికారులు రెండు మూడు సార్లు క్షేత్రస్థాయి పరిశీలన (ఎంక్వైరీ) జరిపి, పక్కా ఆధారాలతో లబ్ధిదారులకు పట్టాలు కూడా పంపిణీ చేశారని తెలిపారు.
అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే అర్హులైన కొంతమంది లబ్ధిదారులను జాబితా నుండి తొలగించి, కొత్తవారికి ఇస్తామని ప్రకటనలు చేయడం దారుణమన్నారు. దానికి అనుగుణంగా అధికారులు రకరకాల విచారణల పేరిట అర్హులను అనర్హులుగా మార్చేందుకు సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు.
అధికారుల వంకలు – అర్హులకు అన్యాయం:
వెంటనే రాజకీయ ప్రమేయాలు మాని, పాత జాబితా ప్రకారమే 444 మంది లబ్ధిదారులకు మిగిలిపోయిన స్వల్ప పనులను పూర్తి చేసి ఇండ్లను ఏకకాలంలో అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లబ్ధిదారుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.