రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 26: హైదరాబాద్లోని టీ-వర్క్స్ వేదికగా నిర్వహించిన తెలంగాణ అండ్ హైదరాబాద్ ఎలైట్ బ్రాండ్ అవార్డ్స్ – 2026 కార్యక్రమంలో బీఎస్ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓలు భాను చందర్ గరిగెల, శారదా నేనావత్లకు 'టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది ఇయర్ – 2026' అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ పిన్నాకిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, వోయ్సియస్ సాంకేతిక భాగస్వామ్యంతో నిర్వహించారు.
సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ భద్రత, క్లౌడ్ సేవలు, వెబ్ మరియు మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి, డిజిటల్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచి, దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను విజయవంతంగా అందిస్తున్నందుకు భాను చందర్ గరిగెల, శారదా నేనావత్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
ఈ అవార్డును ఒలింపిక్ పతక విజేత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత సైనా నెహ్వాల్, కేంద్ర ఆర్థిక సేవల శాఖ సంయుక్త కార్యదర్శి ఆదిత్య ప్రవీణ్ చేతుల మీదుగా భాను చందర్ గరిగెల, శారదా నేనావత్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భాను చందర్ గరిగెల, శారదా నేనావత్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు సంస్థ బృందం సమష్టి కృషికి, ఖాతాదారుల విశ్వాసానికి దక్కిన గౌరవమని తెలిపారు. భవిష్యత్తులో మరింత వినూత్న సాంకేతిక పరిష్కారాలతో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సేవలను విస్తరించి, సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.