రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 18/ భువనగిరి మున్సిపల్ పట్టణ పరిధిలోని 23వ వార్డులోని ఇందిర నగర్ కాలనీలో శనివారం మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బర్రె జహంగీర్ మాజీ చైర్మన్ మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిలో భాగంగానే ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు రావాలని సూచించారు.
వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ మాట్లాడుతూ, తమ వార్డులో అర్హులైన ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాన్ని వార్డులో సమర్థవంతంగా అమలు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందించిన ఆకర్షణీయమైన రంగుల్లో నాణ్యమైన చీరలను అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత- జహంగీర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ పి సుదర్శనం మంజుల, అనిల్ నాయక్ వార్డ్ ఇంచార్జ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ అధికారులు, ఆర్పీలు, మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.