royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం….వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 2:37 pm
Date of Publish : 14 Jul 2026, 12:30 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 20 💬 0
Latest News > తెలంగాణ > హైదరాబాద్

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం….వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

మహిళా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు ఖండనీయం….వెంటనే చర్యలు తీసుకోవాలి: బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 13: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పేరిట ప్రచారంలో ఉన్న ఆడియోలో సీనియర్ మహిళా నాయకురాలు, యాదవ సంక్షేమం కోసం దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఈశ్వరమ్మ యాదవ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న ఆరోపణలను బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించే భాష ఏ సమాజానికీ శోభనివ్వదని, సమాజ సేవలో జీవితాన్ని అంకితం చేసిన మహిళా నాయకురాలిని కించపరచడం కన్నతల్లిని అవమానించినంత బాధ కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకుడు మహిళల పట్ల గౌరవం, సంయమనం, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈశ్వరమ్మ యాదవ్‌కు సభ్యురాలిగా అవకాశం కల్పించడాన్ని జీర్ణించుకోలేక కొందరు యాదవ సామాజిక వర్గాన్ని అవమానించేలా, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోందని కుమారస్వామి పేర్కొన్నారు. ప్రభుత్వ నియామకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే అయినప్పటికీ, ఒక మహిళను లేదా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం, కుల అహంకారాన్ని ప్రదర్శించే ధోరణి ఏ పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు బీసీ వర్గాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దృష్టి సారించి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి లిఖితపూర్వకంగా తీసుకెళ్లి, మహిళల గౌరవాన్ని పరిరక్షించేలా పార్టీ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత వ్యక్తిపై పార్టీ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యాదవ సమాజానికి, బీసీ వర్గాలకు బహిరంగ క్షమాపణ చెప్పేలా చర్యలు ఉండాలని కోరారు.

మహిళల గౌరవం, బీసీ సమాజ ఆత్మగౌరవం, రాజ్యాంగబద్ధ సమానత్వ విలువలను కాపాడడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని దుండ్ర కుమారస్వామి అన్నారు. మహిళలను లేదా సామాజిక వర్గాలను అవమానించే వ్యాఖ్యలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని స్పష్టం చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీసే స్థాయికి వెళ్లకూడదని, సమాజంలో సామరస్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని ఆయన పేర్కొన్నారు.