రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 29/ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 23వ వార్డు ఇందిరానగర్లోని బోయవాడ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ బర్రె పూజిత, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 'పోలియో వైరస్' వల్ల వచ్చే పోలియో వ్యాధి కలుషిత నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనికి చికిత్స లేదని, వ్యాక్సిన్ తీసుకోవడమే ఏకైక రక్షణ మార్గమని తెలిపారు.
2014 తర్వాత దేశంలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాకపోవడం గర్వకారణమే అయినప్పటికీ, ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, "నిండు జీవితానికి రెండు చుక్కలే కీలకం" అని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా పల్స్ పోలియో కార్యక్రమాన్ని మర్చిపోవద్దని, తమ పిల్లలను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి రెండు చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు బండారు రవివర్ధన్, ఎండి అఖిల్, గోపిబాబు, బర్రె క్రాంతి, కసరబోయిన సాయి కుమార్, ఎడ్ల భరత్, గోపి నవీన్ తదితరులు, పోలియో సిబ్బంది పాల్గొన్నారు.