టీజేయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశాలు
వసూళ్ రాజా రాజకీయాలకు సమాధి కావాలి – రాజకీయాల్లో జాతీయవాద భావాలు పెరగాలి
టీజేయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణపై రౌండ్ టేబుల్ సమావేశాలు
రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూన్ 5: తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టీజేయూ) ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో "తెలంగాణ – ప్రజాస్వామ్యం" అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అధ్యక్షత వహించారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, సాంస్కృతిక అస్తిత్వం, జాతీయవాద భావజాలం, సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, యువత ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ మాట్లాడుతూ, "వసూళ్ రాజా రాజకీయాలకు సమాధి కావాలి. ప్రజల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణే రాజకీయాల ప్రధాన లక్ష్యంగా ఉండాలి" అని అన్నారు. రాజకీయాలు ప్రజాసేవకు వేదిక కావాలని, వసూళ్లు, స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలను ఉపయోగించే ధోరణికి ముగింపు పలకాలన్నారు. రాజకీయాల్లో జాతీయవాద భావాలు పెరిగి దేశ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం వేలాది మంది విద్యార్థులు, యువత, ప్రజల త్యాగాల ఫలితంగా సాధ్యమైందని అన్నారు. ఉద్యమ సమయంలో ప్రతిపాదించిన "నీళ్లు–నిధులు–ఉద్యోగాలు" ఆశయాలు ఎంతవరకు నెరవేరాయో సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు దశాబ్దం దాటినా రైతులు, నిరుద్యోగులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.
జీ న్యూస్ చీఫ్ ఎడిటర్ భారత్ మరియు నేషనలిస్ట్ హబ్ సాయి మాట్లాడుతూ, గో సంరక్షణ, దేవాలయాల భద్రత, మత సామరస్యం, రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, కాకతీయ సంస్కృతి, ప్రాంతీయ అస్తిత్వం వంటి అంశాలకు ప్రస్తుత రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత, పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు, వలసల ప్రభావంపై సమగ్ర విధానాలు రూపొందించాలని కోరారు.
వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలతో సహా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, సామాజిక న్యాయం అంశాల్లో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీజేయూ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్రావు, హిందూ జనశక్తి నాయకుడు లలిత్, ఎస్సీ హక్కుల పోరాట సమితి నాయకుడు అరవింద్, రవీందర్ గౌడ్, మహేందర్ వేయపల్లి, శ్రీశైలం, ఎం.గిరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు పోచ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న వక్తలు తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి, ఉపాధి, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, జాతీయ చైతన్యం అనే ప్రధాన స్తంభాలపై నిర్మితమవ్వాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేసే దిశగా ఇటువంటి చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.