రాయల్ పోస్ట్ న్యూస్ ఘట్ కేసర్ జూన్ 4/ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిస్తూ మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు శ్రీ ఈటల రాజేందర్ గారు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు కలిసి మొక్క నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రకృతిని రక్షించడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమేనని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గిపోతున్న అటవీ సంపద వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
"చిన్న చర్యలు – పెద్ద ప్రభావం" అనే సందేశంతో ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వినియోగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రీసైక్లింగ్కు ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలను పాటించాలని కోరారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం, సంస్థలు మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని నాయకులు తెలిపారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ మొక్కల నాటే కార్యక్రమం ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు