*
రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి రూరల్ /
జూన్ 2/తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలు మరియు సుదీర్ఘ పోరాట ఫలితంగా ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బతుకమ్మ వంటి సాంప్రదాయ పండుగలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, తెలంగాణ యాసకు ప్రత్యేక గౌరవం దక్కిందని తెలిపారు.అదేవిధంగా డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి రాష్ట్ర సాధనకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ సేవలను ఈ సందర్భంగా స్మరించారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కలలుగన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారని, “కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేశారని తెలిపారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరవకూడదని, భవిష్యత్ తరాలకు వారి పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.గ్రామ అభివృద్ధి, ముఖ్యంగా విద్యా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు. తమ సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో గతంలో 54 మంది మాత్రమే ఉన్న విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 87 మందికి చేరడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య, మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దామని, మరింత విస్తృత స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ స్థలాభావం కారణంగా ప్రస్తుతం ఉన్న భవనాన్నే అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి ఆదర్శ విద్యా సంస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా తాజ్పూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, అందరూ కలిసి పనిచేస్తే గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని అన్నారు.
ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఆరోగ్య భద్రత రీత్యా వారికి శానిటైజర్ లు, మాస్కులు, గ్లౌస్ లు, మాస్కులు, సబ్బులు తదితర వస్తువులు అందజేయడం జరిగింది….
ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ రావు,ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, ఎస్కే గాలిబ్ యాకుబ్, బొమ్మరపు రామకృష్ణ, బొమ్మరపు లక్ష్మీ బాలరాజు, బిట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, ఎస్కే హైమద్, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు వరిగంటి రమేష్, వరిగంటి వేణు, రాంపల్లి నాగరాజు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.