హనుమకొండ, ఆగస్టు 15 రాయల్ పోస్ట్ న్యూస్ /

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని టీవీ టవర్ కాలనీలో నిర్వహించిన వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా జరిగాయి. టీవీ టవర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పల్లెపాటి సమ్మిరెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సమ్మిరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. నిజమైన దేశభక్తి అంటే జాతీయ జెండాకు వందనం చేయడమే కాకుండా, సమాజ అభివృద్ధికి ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతను నిర్వర్తించడమని పేర్కొన్నారు.
టీవీ టవర్ కాలనీని పరిశుభ్రత, పచ్చదనం, మెరుగైన మౌలిక వసతులు, ప్రజల భాగస్వామ్యంతో నగరంలోనే ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దేందుకు డెవలప్మెంట్ కమిటీ కట్టుబడి పనిచేస్తోందని సమ్మిరెడ్డి తెలిపారు. ప్రజల సహకారంతో కాలనీ అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో డెవలప్మెంట్ కమిటీ కార్యదర్శి ఎండవెల్లి కిషన్ రెడ్డి, కోశాధికారి పూజారి మనోజ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, రమేష్, బుచ్చిరెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎర్ర రాజిరెడ్డి, రవీందర్, సారంగపాణి, శ్రీనివాస రెడ్డి, మాధవరెడ్డి, రవీందర్ రెడ్డి చారి, కార్పొరేషన్ సిబ్బంది, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.