రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 14/

యాదాద్రి భువనగిరి: మాజీ మంత్రి హరీష్ రావుపై తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య. తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఒకవైపు ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థలను విమర్శిస్తూ మరోవైపు అదే సంస్థలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ, “హరీష్ రావు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలకు పాలు సరఫరా చేస్తున్నారని, ‘మిల్చీ డైరీ’ సంస్థకు ఆయనకు సంబంధం ఉందో లేదో ప్రజలకు స్పష్టం చేయాలి” అని డిమాండ్ చేశారు. మిల్చీ పాల సంస్థను హరీష్ రావు సతీమణి నిర్వహిస్తున్నారని, తన్నీరు శ్రీనిత పేరుతో ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
హరీష్ రావుకు 24 గంటల గడువు ఇస్తున్నామని, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మిల్చీ సంస్థతో తనకు సంబంధం ఉందో లేదో బహిరంగంగా ప్రకటించాలని సవాల్ విసిరారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థలతో దొంగచాటుగా వ్యాపారం చేస్తూ, ప్రజల ముందు మాత్రం ఆంధ్ర సంస్థలను విమర్శించడం హరీష్ రావుకు అలవాటైందని ఆరోపించారు. తన మిల్చీ సంస్థ ప్రయోజనాల కోసం విజయ డైరీ, మదర్ డైరీ వంటి సంస్థలను నష్టాలపాలు చేశారని కూడా విమర్శించారు.
హరీష్ రావు యాదగిరిగుట్టకు వచ్చినా, అసెంబ్లీకి వచ్చినా తనకు అభ్యంతరం లేదని, ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని బీర్ల అయిలయ్య తెలిపారు. “దమ్ముంటే నా సవాల్ను హరీష్ రావు స్వీకరించాలి” అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతోనే మిల్చీ డైరీ ఏర్పాటు చేశారని బీర్ల అయిలయ్య ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ తెలంగాణ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇద్దరు నేతలకు మతి భ్రమించిందని విమర్శించారు.
కేటీఆర్ పాదయాత్ర ప్రకటించగానే హరీష్ రావుకు కూడా పాదయాత్ర గుర్తుకు వచ్చిందని, కేటీఆర్ను రాజకీయంగా అడ్డుకునేందుకే హరీష్ రావు పాదయాత్ర చేపడుతున్నారని వ్యాఖ్యానించారు.అదేవిధంగా, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు బయటపడతాయనే భయంతో బీజేపీతో బీఆర్ఎస్ నేతలు చీకటి ఒప్పందం చేసుకున్నారని బీర్ల అయిలయ్య ఆరోపించారు.