రాయల్ పోస్ట్ న్యూస్ హనుమకొండ, జులై 14:ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు అని, అర్హులైన ప్రతి ఓటరు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ‘సర్’ ఫారాలను తప్పనిసరిగా నింపి సమర్పించాలని అయినవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ ఆదేశాల మేరకు ఐనవోలు మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ గౌడ్ క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. అర్హులైన ప్రతి ఓటరు ఓటరు జాబితాలో తమ పేరు సక్రమంగా నమోదై ఉండేలా అవసరమైన ‘సర్” ఫారాలను నింపి, బిఎల్ఎ లకు సమర్పించాలని, ఐనవోలు కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోహన్ గౌడ్, నాయకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా అయినవోలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నకరకంటి మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హులైన పౌరుడు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని, ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఓటరు నమోదు, మార్పులు, అభ్యంతరాలకు సంబంధించిన ఫారాల నింపడంలో ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రఘు అన్న, బీఎల్ఏ తాటికాయల ప్రశాంత్, చింత ఏలియా, నాతి మహేష్ తదితరులు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ‘సర్” ప్రక్రియపై వివరాలు తెలియజేస్తూ, ఫారాలు నింపడంలో సహకరించారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

