హైదరాబాద్, జూలై 09 రాయల్ పోస్ట్ న్యూస్ : విద్యార్థులు సరైన లక్ష్యాల్ని ఎంచుకుని శ్రమించి వాటిని చేరుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ సూచించారు. బర్కత్ పుర లోని అవంతి విద్యా సంస్థల ఆద్వర్యంలో ‘ప్రవిష్ట – 2026’ పేరుతో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల దిల్ సుక్ నగర్ బ్రాంచి ప్రిన్సిపాల్ డాక్టర్ బైస్ స్వాతి, బర్కత్ పుర బ్రాంచి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వేణుగోపాల్ లు కళాశాల సాధించిన ప్రగతి విద్యా నివేదికలను సమర్పించారు. అవంతి విద్యా సంస్థల ప్రధానకార్యదర్శి డాక్టర్ ఎం.ప్రియాంక స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్యఅతిధిగా హాజరైన ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ మాట్లాడుతూ… విద్యా ప్రమాణాలను కాపాడుతూ, ఆవిష్కరణలు, నాయకత్వ సంస్కృతిని పెంపొందిస్తున్నందుకు కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ‘ప్రస్తుత యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి’ అని, ఇవి విద్యార్థుల చదువులను దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరికరాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు స్వయం ఉపాధి దిశగా తమ స్వంత స్టార్టప్లను ప్రారంభించాలని కోరారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)పై పూర్తిగా ఆధారపడకూడదని ఆయన విద్యార్థులకు సూచించారు. అవంతి విద్యా సంస్థల చైర్మన్, మాజీ మంత్రి ఎం.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ… భవిష్యత్తు అంతా యువతరానిదే అని అన్నారు. సాంకేతికతను సానుకూల మార్గంలో ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉద్యోగ నైపుణ్యాలను పొంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులు కృత్రిమ మేధస్సు పై కాకుండా తమ సహజ మేధస్సు పైనే అధారపడాలని పిలుపునిచ్చారు. కళాశాల డైరెక్టర్ జయప్రద, ఐసిఏఐ చైర్మన్ డి. వెంకట రాంబాబు, ఎల్స్ స్టాఫ్ టెక్నాలజీస్ హెచ్ఎర్ డైరెక్టర్ గరిమా పాండే, బ్రహ్మకుమారీస్ ఇంచార్జీ డాక్టర్ బికె శ్రీలత, కళాశాల హెచఓడిలు, ఇంచార్జీలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

